అమిత్‌ షాతో ఏక్‌నాథ్‌ శిండే భేటీ

2024-11-28 17:41:40.0

మహారాష్ట్ర సీఎం, ప్రభుత్వ ఏర్పాటుపై ఓ ప్రకటన వెలువడే అవకాశం

https://www.teluguglobal.com/h-upload/2024/11/28/1381841-shinde.webp

మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్‌ కొనసాగుతున్నది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆ రాష్ట్ర ఆపధ్ధర్మ సీఎం ఏక్‌నాథ్‌ శిండే గురువారం రాత్రి కేంద్ర మంత్రి అమిత్‌ షాతో సమావేశమయ్యారు. సాయంత్రం హస్తినకు చేరుకున్న ఆయన నేరుగా షా నివాసానికి చేరుకున్నారు. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, దేవేంద్ర ఫడ్నవీస్‌, ఎన్సీపీ చీఫ్‌ అజిత్‌ పవార్‌లు కూడా రాత్రి పది గంటల సమయంలో హోం మంత్రి ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మహాయుతి పక్షాల మధ్య భేటీ జరిగింది. భేటీ అనంతరం మహారాష్ట్ర సీఎం, ప్రభుత్వ ఏర్పాటుపై ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది.

రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటునకు తాను అడ్డు కాబోనని.. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలు తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని ఆపధ్ధర్మ సీఎం ఏక్‌నాథ్‌ శిండే ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. దీంతో మహారాష్ట్ర సీఎం పగ్గాలు బీజేపీకే దక్కుతాయని, దేవేంద్ర ఫడ్నవీస్‌ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు డిప్యూటీ సీఎంలు, కేబినెట్‌ బెర్తులపై స్పష్టత రానున్నది. 

Maharashtra power play,Fadnavis,Shinde,Pawar meet,Amit Shah,Finalise new govt structure