ఈ రోజు నా రాజకీయ జీవితంలో ప్రత్యేకంగా గుర్తుంటుంది : సీఎం రేవంత్‌రెడ్డి

2025-02-04 13:42:42.0

ఎస్సీ కులాల ఉప వర్గీకరణపై తెలంగాణ అసెంబ్లీ రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు.

ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు అమలుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారు. కోర్టు తీర్పు అమలు కోసం ఏకసభ్య కమిషన్‌ వేశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భారత దేశంలో మిగిలిన రాష్ట్రాల కంటే ముందే తెలంగాణలో వర్గీకరణ అమలు చేస్తామని అన్నారు. వర్గీకరణ చేయాలని ఏకసభ్య కమిషన్‌ సిఫారసు చేసింది. కమిషన్‌ పలు జిల్లాల్లో పర్యటించి సమగ్ర నివేదిక రూపొందించింది. నేరుగా ప్రజలను కలుసుకుని విజ్ఞప్తులు సేకరించింది. మరికొందరు కమిషన్‌కు ఆన్‌లైన్‌ ద్వారా విజ్ఞప్తులు అందించారు. 82 రోజుల్లో కమిషన్‌ తన నివేదికను అందించింది. 15 శాతం ఎస్సీ రిజర్వేషన్లను 3 గ్రూపులకు పంచుతూ కమిషన్ సిఫారసు చేసింది. ఎస్సీల్లో మొత్తం 59 ఉప కులాలను గ్రూప్‌-1, 2, 3గా వర్గీకరించాలని కమిషన్‌ సిఫారసు చేసింది. గ్రూప్‌-1లోని 15 ఉపకులాలకు 1 శాతం రిజర్వేషన్‌ (జనాభా 3.288 శాతం), గ్రూప్‌-2లోని 18 ఎస్సీ ఉపకులాలకు 9శాతం రిజర్వేషన్‌ (జనాభా 62.74 శాతం), గ్రూప్‌-3లోని 26 ఉప కులాలకు 5శాతం రిజర్వేషన్‌ (జనాభా 33.963శాతం) కల్పించాలని వర్గీకరణ కమిషన్‌ తన నివేదికలో పేర్కొంది. ఎస్సీ కులాల గ్రూప్‌లకు రోస్టర్‌ పాయింట్లు, క్రిమీలేయర్‌ విధానాన్ని కూడా అమలు చేయాలని కమిషన్‌ సిఫారసు చేసింది.

ఎస్సీ వర్గీకరణ, కులగణన.. నా రాజకీయ జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిన అంశాలు. ఫిబ్రవరి 4, 2025.. నా రాజకీయ జీవితంలో ప్రత్యేకంగా గుర్తుండి పోతుంది. వర్గీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎంతోమంది ముఖ్యమంత్రులకు రాని గొప్ప అవకాశం నాకు వచ్చింది. ఎస్సీ వర్గీకరణను అమలు చేయడం నాకు అత్యంత సంతృప్తినిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడే కాదు.. గతంలోనూ దళితులకు ఉన్నత పదవులు, అవకాశాలను కాంగ్రెస్ కల్పించిందని సీఎం అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ నిరంతరం శ్రమిస్తుందని చెప్పారు. అంతకుముందు ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రవేశ పెట్టారు. ఎస్సీ కులాల ఉప వర్గీకరణపై గౌరవ సుప్రీంకోర్టు భారత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు దేశంలోనే మిగతా రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎందరో ముఖ్యమంత్రులకు రాని అవకాశం నాకు వచ్చింది. చాలా రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఓటు బ్యాంకుగా చూశాయి తప్ప.. ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే ప్రయత్నం చేయలేదు. అందుకే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడం ద్వారా సమాజంలో తరతరాలుగా నిర్లక్ష్యానికి, దోపిడీకి గురైన వారికి న్యాయం చేయాలని సంకల్పించాం. వర్గీకరణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరుతున్నా’’ అని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Mandakrishna Madiga,Classification of SC,Legislative Council approval,Summary of Commission,CM Revanth reddy,GHMC,KCR,Congress Party,BRS party,Telangana govermnet,CS Shanthi kumari,Minister Uttam Kumar Reddy,Damodara Rajanarsimha,Ponnam Prabhakar,Seethakka,MP Mallu Ravi