కనులపండువగా శ్రీవారి మహారథోత్సవం

2024-10-11 04:05:05.0

శుక్రవారం రాత్రి అశ్వవాహనంపై కల్కి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్న స్వామివారు

https://www.teluguglobal.com/h-upload/2024/10/11/1368100-ttd.webp

శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఉదయం మహారథోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో భక్తులు భారీ ఎత్తున పాల్గొని జయజయధ్వానాలు చేశారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి తిరుమాడ వీధుల్లో విహరించారు. గోవింద నామస్మరణతో భక్తులు రథాన్ని లాగారు.

శుక్రవారం రాత్రి స్వామివారు అశ్వవాహనంపై కల్కి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. దీంతో వాహన సేవలు పూర్తి కానున్నాయి. శనివారం చివరి ఘట్టమైన చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను టీటీడీ ఈవో శ్యామలరావు పరిశీలించారు. భక్తులు ప్రశాంతంగా పుణ్యస్నానాలు చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. పుష్కరిణిలో ఇబ్బందిలేకుండా భద్రతాపరమైన చర్యలు చేపడుతున్నారు.

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు పడుతున్నది. 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం శ్రీవారిని 60,775 మంది దర్శించుకున్నారు. 25,288 మంది తలనీలాలు సమర్పించారు. గురువారం తిరుమల శ్రీవారి హుండీకి రూ. 3.88 కోట్ల ఆదాయం వచ్చింది.