ప్రశాంత్‌ కిశోర్‌ ఆమరణ దీక్ష భగ్నం

2025-01-06 06:00:45.0

బీపీఎస్‌సీ ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణల నేపథ్యంలో నాలుగురోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న పీకే

https://www.teluguglobal.com/h-upload/2025/01/06/1391912-pk.webp

బీపీఎస్‌సీ వ్యవహారంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే) చేస్తున్న ఆమరణ నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేశారు. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో గత నాలుగు రోజులుగా నిరవధిక నిరహారదీక్ష చేస్తున్న ప్రశాంత్‌ కిషోర్‌ను సోమవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేసి.. ఆస్పత్రికి తరలించినట్లు అధికారికవర్గాలు వెల్లడించాయి. చట్టవిరుద్ధంగా నిరసన చేపట్టినందువల్ల ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిరసన ప్రదేశంలో గుమిగూడిన అభ్యర్థులను అక్కడి నుంచి ఖాళీ చేయించామన్నారు. కాసేపట్లో ఆయనను కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.

ఇటీవల బీహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (బీపీఎస్‌సీ) నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రశాంత్‌ కిషోర్‌ జనవరి 2న గాంధీ మైదానంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. గత రెండు వారులుగా బీపీఎస్‌సీ అభ్యర్థులు తీవ్ర ఆందోళనలు చెపడుతున్నా, ప్రభుత్వంలో ఎలాంటి కదలిక రావడం లేదని మండిపడ్డారు. ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసి.. మళ్లీ కొత్తగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

డిసెంబర్‌ 13న నిర్వహించిన బీపీఎస్‌సీ కంబైన్డ్‌ కాంపిటేటివ్‌ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో నిరుద్యోగులు ఆందోళన కొనసాగిస్తున్న విషయం విదితమే పరీక్షను రద్దు చేసి.. కొత్త మళ్లీ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. పరీక్షను రద్దు చేసే ప్రసక్తే లేదని అధికారులు తేల్చిచెప్పారు. ఈ క్రమంలో ఉద్యోగార్థులు తమ ఆందోళనల్ని ఉధృతం చేయగా.. ప్రశాంత్‌ కిశోర్‌ వాళ్లకు మద్దుతుగా నిలిచారు.

Prashant Kishor,Arrested,Amid hunger strike,Support,BPSC exam protesters