2016-06-17 03:37:12.0
యుద్ధాలు జరిగినపుడు సాధారణంగా గెలిచిన వారి గురించి, వీరుల గురించి చెప్పుకుంటాం. వారి కథలే చరిత్రలుగా మనకు కనబడుతుంటాయి. కానీ తమకే మాత్రం సంబంధం లేకుండా యుద్ధాల కారణంగా జీవితాలు కోల్పోయి, యుద్ధభూమిలో కంటే ఎక్కువగా జీవిత పోరాటాలు చేసే వారు మహిళలు. వారి మనోవేదన నిజంగా అక్షరాలా నమోదైతే, మనిషన్నవాడు ఏవడూ యుద్ధాలను కోరుకోడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ సైనికుల బారిన పడి చిత్రహింసలు, లైంగికదాడులకు గురయిన వందల, వేల మంది ఆసియా […]
http://www.teluguglobal.com/wp-content/uploads/2016/06/women.gif
యుద్ధాలు జరిగినపుడు సాధారణంగా గెలిచిన వారి గురించి, వీరుల గురించి చెప్పుకుంటాం. వారి కథలే చరిత్రలుగా మనకు కనబడుతుంటాయి. కానీ తమకే మాత్రం సంబంధం లేకుండా యుద్ధాల కారణంగా జీవితాలు కోల్పోయి, యుద్ధభూమిలో కంటే ఎక్కువగా జీవిత పోరాటాలు చేసే వారు మహిళలు. వారి మనోవేదన నిజంగా అక్షరాలా నమోదైతే, మనిషన్నవాడు ఏవడూ యుద్ధాలను కోరుకోడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ సైనికుల బారిన పడి చిత్రహింసలు, లైంగికదాడులకు గురయిన వందల, వేల మంది ఆసియా దేశాల మహిళల కథలు మన గుండెలను కదిలించేలా ఉన్నాయి. సైనికులు లైంగిక బానిసలుగా వినియోగించుకోగా కంఫర్ట్ ఉమెన్గా నరకాన్ని అనుభవించిన కొన్నిదేశాల మహిళలకు జపాన్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పి నష్టపరిహారం చెల్లించింది. కానీ ఫిలిప్పీన్స్ మహిళలు ఇంకా తమకు జరగాల్సిన న్యాయం జరగలేదంటున్నారు. ఇప్పుడు 80 పైన వయసులో ఉన్న ఆ వృద్ధ మహిళలు ఇందుకోసం ఉద్యమిస్తున్నారు ఆ కథనం-
పిలిప్పీన్స్లోని మాపినిక్ అనే గ్రామానికి చెందిన అక్కా చెల్లెళ్లు రెండో ప్రపంచ యుద్ధం చేసిన గాయాలను ఇంకా మనసులో మోస్తున్నారు. మాపినిక్కి సమీపంలో ఉన్న, తాము చిత్రహింసలకు గురయిన భవనం రెడ్విల్లా ఇప్పుడు కూలిపోయి నేలమట్టం అయిపోయినా, ఆ ప్రదేశం ఇంకా వారి గాయాలకు సాక్ష్యంగానే ఉంది. లితా, మిలెంగ్ అనే ఆ ఇద్దరు మహిళలు ఇప్పుడు 80 దాటిన వయసులో ఉన్నారు. 1944లో జపాన్ సైనికులు వారిని బంధించి నపుడు వారి వయసులు 13, 15.
వారి గ్రామం మొత్తాన్ని దోచుకుని 100కు పైగా మహిళలు, బాలికలను సైనికులు తీసుకువెళ్లి రెడ్హౌస్లో బంధించారు. తమ జీవితాలు ముగిసిపోయాయని వారు భయపడ్డారు. కానీ ఆ సైనికులు ఆ అమాయక మహిళలను అంతకంటే ఎక్కువగా చిత్రవధ చేశారు. పగలంతా తిని, పొగతాగుతూ గడిపే సైనికులు… రాత్రవగానే అత్యాచారాలు మొదలుపెట్టేవారని ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు తెలిపారు. ఆ బాధని వర్ణించలేమని మిలెంగ్ తెలిపింది. తాను ప్రతిఘటించినపుడు వారు తన కాళ్లమీద ఎలా కొట్టేవారో …ఆమె వినేవారి మనసులు ద్రవించేలా చెప్పింది. అత్యాచారం తరువాత ఆయా మహిళలను వదిలేసేవారు. సైనికులు ఇళ్లను తగులబెట్టగా అందులో వీరి ఇల్లు కూడా ఉంది. అలా ఇళ్లను పోగొట్టుకున్న వారు మరో గ్రామాన్ని చేరారు. ఈ సంఘటనల క్రమంలో సైనికులు వదిలేసిన తరువాత లితా, మిలెంగ్లకు ఒకరిని ఒకరు చేరుకునేందుకే మూడురోజులు పట్టింది. ప్రపంచ చరిత్రలోనే అత్యంత దారుణమైన లైంగిక హింసకు ఈ ఇద్దరూ ఇప్పుడు ఆనవాళ్లుగా మిగిలి ఉన్నారు.
మొత్తం రెండులక్షల మంది మహిళలను బందీలుగా పట్టుకున్న సైనికులు వేలమందిపై అత్యాచారాలు చేశారు. బాధితులు ఎక్కువగా కొరియా, చైనాలకు చెందినవారని చరిత్ర చెబుతుండగా, బర్మా. న్యూ జెనీవా, ఫిలిప్పీన్స్ మహిళలు సైతం ఈ బాధితుల్లో ఎక్కువగానే ఉన్నారని తెలుస్తోంది. ఫిలిప్పీన్స్లోని చారిత్రక రికార్డో జోస్ ఆఫ్ ది యూనివర్శిటీ చెబుతున్నదాన్ని బట్టి ఇదంతా చాలా ప్రణాళికా బద్ధంగానే జరిగింది. ఎందుకంటే 1930ల్లో జపాన్ సైనిక దళాలు అత్యాచారాలతో చైనాలో వీరంగం సృష్టిస్తున్నపుడు లైంగిక వ్యాధులు వ్యాపించడం కనుగొన్నారు. దాంతో జపాన్ ఆర్మీ దీనికి పరిష్కారంగా మరొక కుయుక్తిని ప్రయోగించింది. కొంతమంది మహిళలను కంఫర్ట్ ఉమెన్గా శాశ్వతంగా అక్కడే ఉండేలా చేసుకుని వినియోగించుకోమని సూచించింది. కంఫర్ట్ ఉమెన్గా ఉండటం అంతకంటే ఘోరమని జోస్ అనే మహిళ చెప్పింది. వీరి పరిస్థితి మరీ ఘోరం… ఎంతమంది వచ్చినా అడ్డుచేప్పలేని పరిస్థితి అది. గంటలు, రోజులు, నెలలు అలా గడిచిపోయేవంటూ ఆమె చేదు జ్ఞాపకాలను నెమరువేసుకుంది.
మధ్య ఫిలిప్పిన్స్కి చెందిన ఎస్టెల్లిటా సైతం ఇలాంటి బాధలను అనుభవించింది. ఆమెని 14 ఏళ్ల వయసులో జపాన్ సైనికులు బంధించి తీసుకువెళ్లారు. వారి చేతుల్లో చిత్రవధని అనుభవించింది. మూడువారాలు వారి బంధిఖానాలో ఉంది. ఏడుదశాబ్దాల తరువాత ఇప్పటికీ ఆమె ఆ చేదు జ్ఞాపకాలను మర్చిపోలేక పోతోంది. ఒక రోజు ఉదయం అమెరికా సైనికులు వచ్చి నిద్రలేపటంతో ఆమెకు కొత్త జీవితం మొదలైంది. జపాన్ సైనికులు పారిపోవటంతో ఆమెకు స్వేచ్ఛ లభించింది. అయితే చుట్టుపక్కలవారు మాటలు అంటుంటే అప్పుడు ఆమెకి అర్థమైంది తానెంత దారుణాన్ని అనుభవించిందో. అంతే…టీచర్ కావాలన్నతన ఆశని వదిలేసి, మనీలాలో అజ్ఞాతంలో పేదరికంలో జీవితమంతా మగ్గిపోయింది.
ఎప్పుడూ తన పిల్లలకు గానీ, భర్తకి గానీ ఈ విషయాలు వెల్లడించని ఎస్టెల్లిటా, అది జరిగిన యాభై ఏళ్లకు … కంఫర్ట్ ఉమెన్గా బాధలు అనుభవించిన తన తోటివారిని కలిసి ఇందుకు ప్రచారకర్తగా మారింది. జపాన్నుండి నష్టపరిహారం కోసం పోరాటం మొదలుపెట్టింది. అప్పుడు 1993లో పిలిప్పీన్స్, దక్షిణ కొరియా, ఇతర ప్రాంతాల నుండి కూడా కంఫర్ట్ ఉమెన్గా పనిచేసిన మహిళలు నోరు విప్పాక…జపాన్ ప్రభుత్వం తన క్షమాపణలు చెప్పింది. కొంత ఆర్థిక సహాయాన్నిప్రకటించింది. కానీ అది తమ జీవితాల్లో జరిగిన నష్టానికి సరిపోదని, జపాన్ ప్రభుత్వం పబ్లిక్ అపాలజీ చెప్పి, చట్టబద్ధంగా తమ బాధ్యతని తీసుకుని ఆర్థిక సహాయం చేయాలని వీరు కోరుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జపాన్ విదేశాంగ మంత్రి ఐక్యరాజ్య సమితిలో మహిళల లైంగిక బానిసత్వానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవనే వ్యాఖలు చేయడంతో ఈ ఉద్యమ తీవ్రత మరింతగా పెరిగింది. గత ఏడాది దక్షిణ కొరియా మహిళలకు అలాంటి క్షమాపణలు, నష్టపరిహారం జపాన్ ప్రభుత్వం నుండి అందగా, ఫిలిప్పీన్ మహిళలకు ఇంకా న్యాయం జరగలేదు. తమ ప్రభుత్వం జపాన్ ప్రభుత్వంతో లాలూచీ పడి నష్టపరిహారాన్ని ఆపుతున్నదని ఫిలిప్పీన్ మహిళలు భావిస్తున్నారు. ఇప్పటికీ వెయ్యిమంది వరకు కంఫర్ట్ ఉమెన్గా బాధలు అనుభవించినవారు బతికి ఉండి ఉంటారని, వారందరి బాధ్యతలు తీసుకుని, తమకు జపాన్ ప్రభుత్వం నుండి జరగాల్సిన న్యాయం జరిగితేనే కొంతయినా ఉపశమనంగా ఉంటుందని ఎస్టెల్లిటా భావిస్తోంది. ఇప్పుడు…ఈ విషయాలు తెలుసుకున్నాక… నరజాతి చరిత్ర సమస్తం…స్త్రీ పీడన పరాయణత్వం అనుకోకుండా ఉండలేము.
-వడ్లమూడి దుర్గాంబ
World War II