గబ్బాలో ఆసీస్‌ ఆశలకు వాన ఎదురుదెబ్బ!

https://www.teluguglobal.com/h-upload/2024/12/18/1386874-aus-vs-india.webp

2024-12-18 02:20:31.0

మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 260 రన్స్‌కు ఆలౌట్‌

 

గబ్బా టెస్ట్‌ మొదటి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన ఆసీస్‌.. రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా రన్స్‌ చేసి భారత్‌ ముందు మంచి లక్ష్యాన్ని ఉంచాలని భావించింది. కానీ ఐదు రోజు ఆటకు వరుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో లంచ్‌ బ్రేక్‌ను ముందుగానే అంపైర్లు ప్రకటించారు. ఈ రోజు తొందరగానే మొదలైన ఆటలో టీమిండియా తన చివరి వికెట్‌ను కోల్పోయింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 252/9 తో ఐదు రోజు ఆటను ఆరంభించిన భారత్‌.. మరో 8 రన్స్‌ను జోడించి 260 పరుగులకు ఆలౌటైంది. ఆకాశ్‌ దీప్‌ (31) చివరి వికెట్‌ రూపంలో పెవిలియన్‌ చేరాడు. జస్‌ ప్రీత్‌ బూమ్రా (10*) నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఆసీస్‌కు 185 రన్స్‌ మొదటి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 445 రన్స్‌ చేసిన విషయం విదితమే.

భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసిన వెంటనే బ్యాడ్‌ లైటింగ్‌ కారణంగా ఆట నిలిచిపోయింది. ఫ్లడ్‌లైట్లను సిద్ధం చేసే పనిలో సిబ్బంది ఉండగానే.. వాన పలకరించింది. ఇప్పటికే గంటర్నర ఆట రద్దయ్యింది. ఇవాళ 98 ఓవర్ల ఆట కొనసాగించేలా మొదట అంపైర్లు నిర్ణయించారు. వాన తగ్గి మైదానం సిద్ధం కావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్నది. దీంతో తొలి సెషన్‌లో మరిన్ని ఓవర్ల ఓత పడనున్నది. మధ్యమధ్యలోనూ వర్షం ఆటంకం కలిగించే అవకాశాలే ఎక్కువ అని వాతావరణ శాఖ చెబుతున్నది. ఈ క్రమంలో మ్యాచ్‌ ప్రారంమైతే ఆసీస్‌ వేగంగా రన్స్‌ రాబట్టడానికి యత్నించవచ్చు. భారత్‌ ముందు కనీసం 300 రన్స్‌ టార్గెట్‌ను నిర్దేశించే అవకాశం లేకపోలేదు. మ్యాచ్‌కు ఎలాగూ వర్షం అంతరాయం ఉన్న నేపథ్యంలో భారత బ్యాటర్లు కాస్త పట్టదల ప్రదర్శిస్తే గబ్బాలో కనీసం డ్రాతోనైనా బైటపడే ఛాన్స్‌ ఉంటుందని క్రికెట్‌ పండితులు విశ్లేషిస్తున్నారు.