కవులు, కళాకారులు గళాలు విప్పాలి

2024-12-19 14:27:07.0

https://www.teluguglobal.com/h-upload/2024/12/19/1387404-revanth-book-fair-2.webp

హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌ రెడ్డి

కవులు, కళాకారులు తమ కలాలకు పదును పెట్టాలని, గళాలు విప్పాలని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఎన్‌టీఆర్‌ స్టేడియంలో గురువారం సాయంత్రం హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. చరిత్ర ఎవరు రాసుకుంటే వారి చరిత్రనే చెలామణి అవుతోందని.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, మలి తెలంగాణ ఉద్యమంలో సమిధలైన అమరుల చరిత్ర కంటే రాజకీయ ప్రయోజనం పొందిన వారి గురించే ఎక్కువ చర్చ జరుగుతోందన్నారు. చరిత్రకారులు వాస్తవాలు రాయకపోతే సమాజానికి అసంపూర్తి సమాచారం చేరుతుందన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అందెశ్రీ, గద్దర్‌, గోరటి వెంకన్న, బండి యాదగిరి, గూడ అంజయ్యలాంటి ఎంతో మంది కవులు తమ సాహిత్యం ద్వారా పోరాటాలను నిర్మించారని గుర్తు చేశారు. ఇలాంటి బుక్‌ ఫెయిర్స్‌ చరిత్రను భవిష్యత్‌ తరాలకు చేరవేస్తాయన్నారు. కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, జస్టిస్‌ బి. సుదర్శన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Hyderabad Book Fair,CM Revanth Reddy,History,Poets,Artists